70 year old woman complain on husband at karantaka

కాదంటే.. లైంగిక దాడి

భర్తపై విశ్రాంత ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు

కర్ణాటక:70 ఏళ్ల వయసు వచ్చింది, రోజూ సతాయిస్తూ నరకం చూపుతున్నాడు అని భర్త మీద 65 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ప్రిన్సిపాల్‌ గోవిందరాజనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చెప్పిన మాట వినడం లేదని నేను, నా ఇద్దరు కుమారులు 8 రోజుల్లోగా ఇంటి నుంచి బయటికి వెళ్లాలని భర్త లీగల్‌ నోటీస్‌ ఇచ్చాడని తెలిపింది.

హత్య బెదిరింపులు..
వివరాలు.. బాధితురాలు ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్‌ పనిచేసి రిటైరయ్యారు. ఆమె మంచి హోదాలో ఉండడం భర్తకు నచ్చేది కాదు. జీతం, గ్రాట్యూటీ, పింఛన్‌, ఆస్తులను తన పేర మార్చాలని ఒత్తిడి చేసేవాడు. అతడు 1993లో కుద్రేముఖ్‌లో గనులలో ఉద్యోగం చేస్తూ మానేశాడు. అప్పటి నుంచి భార్యను లైంగిక క్రియ కోసం రోజూ వేధిస్తున్నాడు. అయినా సహిస్తూ వచ్చింది. నవంబరు 22 తేదీన బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు, ప్రతిఘటిస్తే గొంతునులిమి, కొట్టి, దూషించాడు.

 అంతేగాక తన ఇద్దరు కుమారులను హత్యచేస్తానని బెదిరించాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఇంటి సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయినట్లు తెలిపింది. తనకు గుండెకు బైపాస్‌ సర్జరీ అయ్యిందని, శ్వాసకోశ జబ్బుతో చికిత్స పొందుతున్నానని, భర్తకు ఏమాత్రం జాలి, దయ లేదని వాపోయింది. పోలీసులు విచారణకు హాజరుకావాలని సదరు శాడిస్టు భర్తకు నోటీస్‌ జారీచేశారు.