అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలకు ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు-2025 ( SECA-2025)లను కూటమి సర్కార్( AP Govt) ప్రకటించింది. తిరుపతి మున్సిపాలిటీ ( Tirupati Municipality)కి గోల్డ్ అవార్డు, భీమవరం మున్సిపాలిటీ( Bhimavaram Municipality)కి సిల్వర్ అవార్డులు దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలకు ఈ అవార్డులు ప్రకటించగా.. తిరుపతి మెుదటిస్థానం, భీమవరం మున్సిపాలిటీ రెండో స్థానం సొంతం చేసుకున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్‌లో విద్యుత్ వినియోగం, ఆదా చేయడంలో కృషి చేసిన మున్సిపాలిటీలకు ఈ అవార్డులు లభించాయి.


ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు-2025లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్తా చాటింది. గ్రూప్‌ -11 విభాగంలో మొదటి స్థానంలో నిలిచి అవార్డు కైవసం చేసుకుంది. వరసగా నాలుగో ఏడాది సైతం జాతీయ ఇంధన సంరక్షణ అవార్డును సాధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్తు రంగంలో ఏపీ సాధిస్తున్న పురోగతి, విద్యుత్తు ఆదాలో రాష్ట్రం సాధించిన విజయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి, విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సహకారం ఎంతో ఉందని ఈ సందర్భంగా ఆయన కీర్తించారు.


కాగా, జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం సందర్భంగా గత ఆదివారం నాడు ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును రాష్ట్రం తరఫున ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ఎల్‌.శివశంకర్‌ అందుకున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం విజయవాడలో శనివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆయా మున్సిపల్ కమిషనర్లు అవార్డులు అందుకోనున్నారు.