నాలుగు బృందాలను నియమించిన జీవీఎంసీ కమిషనర్
‘ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్’
విశాఖపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
సింహాచలంల గోశాల జంక్షన్ నుంచి అడవివరం జంక్షన్ వరకూ బీఆర్టీఎస్ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయామంటూ అనర్హులు కూడా టీడీఆర్లు పొందిన అంశంపై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పందించారు. అర్హత లేనివారు, అసలు ఆ ప్రాంతంలో భూములు లేనివారు, ఆస్తిపన్ను కట్టనివారు కూడా టీడీఆర్లు పొందారని, భారీగా కుంభకోణం జరిగిదంటూ ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ప్రచురించిన కథనంపై ఆయన స్పందించి, విచారణకు ఆదేశించారు. ఇందుకోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో నలుగురు సిబ్బందిని నియమించారు. ఆయా ప్రాంతాల్లో టీడీఆర్లు పొందినవారు నిజంగా అర్హులా?, కాదా?...అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు, వివరాల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మొదటి బృందానికి 53, రెండో బృందానికి 52, చివరి రెండు బృందాలకు చెరో 50 చొప్పున టీడీఆర్లు పరిశీలించే బాధ్యతలు అప్పగించారు. వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిటీ ప్లానర్-1, 2లు సర్వేను పర్యవేక్షించి చీఫ్ సిటీ ప్లానర్ ద్వారా నివేదికను అందజేయాలని సూచించారు.
బియ్యం కార్డుదారులకు గోధుమ పిండి
విశాఖపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని బియ్యం కార్డుదారులకు జనవరి నెల నుంచి బియ్యం, పంచదార, రాగులతో పాటు గోధుమపిండి కూడా పంపిణీ చేయ నున్నట్టు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కిలో గోధుమపిండి రూ.20కి పంపిణీ చేస్తా మన్నారు. ప్రజలకు పోషకాహారాన్ని అందించా లనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కుందని వెల్లడించారు.
తప్పుడు ఇన్వాయస్ల ద్వారా రూ.27.07 కోట్ల మోసం
విశాఖపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
వ్యాపారం చేయకుండా, సరకులు అందించకుండా, నగదు బదిలీలు లేకుండా అన్నీ చేసినట్టు తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి జీఎస్టీ విభాగం నుంచి రూ.27.07 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ పొందిన మోసగాళ్ల నెట్వర్క్ను విశాఖపట్నం జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం పట్టుకుంది. మల్లికార్జున మనోజ్కుమార్ అనే వ్యక్తి ఈ నెట్వర్క్ను నడుపుతున్నట్టు, ఇవన్నీ ఐటీసీ పేరుతో నడిపినట్టు విచారణలో తేల్చింది. ఈ మోసాలన్నింటిని నిందితుడు అంగీకరించడంతో అరెస్టు చేశామని విశాఖపట్నం డిప్యూటీ డైరెక్టర్ స్వేతా సురేశ్ మంగళవారం ప్రకటనలో తెలిపారు.