రాయదుర్గం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న చెత్త డంపింగ్‌ యార్డ్‌ను మరోచోటకు తరలిస్తామని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని డాక్టర్‌ రాధాకృష్ణ మున్సిపల్‌ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే ముస్తాబు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని శాంతినగర్‌ డంప్‌యార్డు వద్ద 78 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త పేరుకుపోగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడు వేల మెట్రిక్‌ టన్నులు శుభ్రం చేయించామన్నారు. మిగిలిన చెత్తను శుభ్రపరచడానికి కొత్త కాంట్రాక్టర్‌ కోసం అన్వేషణ జరుగుతోందన్నారు. రాబోయే ఉగాది నాటికి శుభ్రం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. శాంతినగర్‌ పరిసర ప్రాంతాల్లో నివాసగృహాలు ఏర్పడినందున స్థానికులు ఈ చెత్త ద్వారా ఇబ్బంది పడుతున్నారన్నారు. చెత్త డంపును చేయడానికి ఉడేగోళం వద్ద 10 ఎకరాలు గుర్తించామన్నారు. కూటమి ఏడాదిన్నర కాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో రూ. 50 కోట్ల వ్యయంతో రోడ్ల అభివృద్ధి, మరమ్మతు పనులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాయదుర్గం, బళ్లారి రహదారి అభివృద్ధి పనులకు శనివారం భూమిపూజ చేశారు.

వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిక

గుమ్మఘట్ట (ఆంధ్రజ్యోతి): మారంపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు, నాయకులు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. రాయదుర్గంలోని ఎమ్మెల్యే స్వగృహంలో టీడీపీ గుమ్మఘట్ట నాయకుడు ఉస్మానసాబ్‌, రామాంజనేయులు, మండల కన్వీనర్‌ సన్నన్న ఆధ్వర్యంలో 18 కుటుంబాలకు చెందిన వారు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఆశయాలకు అనుగునంగా కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని ఆయన తెలియజేశారు.