అనకాపల్లి (తాళ్లపాలెం), డిసెంబర్20:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా రూ.68.25 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.

ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు, ఫీకల్ స్లడ్జ్ శుద్ధి ప్లాంట్లు, గోబర్ దన్ ప్లాంట్లు, గ్రే వాటర్ నిర్వహణ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపనలు చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం, రాష్ట్రాన్ని జనవరి 26 నాటికి రోడ్లపై చెత్త రహితంగా, జూన్ 2026 నాటికి ప్లాస్టిక్ రహితంగా చేయాలని లక్ష్యం పెట్టారు.

అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించిన చంద్రబాబు, అనకాపల్లిని పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేస్తామని, పోలవరం నీటిని ఇక్కడికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గ్రీన్ అంబాసిడర్లతో సంభాషించి, విద్యార్థులకు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
