హైదరాబాద్:భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ద్రౌపది ముర్ము నిన్ననే నగరానికి రాగా.. ఈరోజు(శనివారం) సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్న సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోగా.. మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఘనస్వాగతం పలికారు. నేడు జరిగే పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల ముగింపు సదస్సులో ఉప రాష్ట్రపతి పాల్గొనున్నారు. మరోవైపు శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి.. రామోజీ ఫిల్మ్‌సిటీలో నిన్న జరిగిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(పీఎస్సీ) ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈరోజు గచ్చిబౌలిలో బ్రహ్మ కుమారిస్ శాంతి సర్వోవర్‌ను ఆమె సందర్శించారు.


ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి సీతక్క రాష్ట్రపతి ముర్ముకి ఘనస్వాగతం పలికారు. బ్రహ్మ కుమారిస్ 21వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మొక్కలు నాటారు. కాగా, రెండ్రోజుల పర్యటన సందర్భంగా నేడు హైదరాబాద్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి.. నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్‌పర్సన్ల సమావేశ ముగింపు సెషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్‌కి వెళ్లి రాత్రికి అక్కడే బస చేయనున్నారు.


ఆదివారం ఉదయం శ్రీ రామచంద్ర మిషన్, హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో నిర్వహించే వరల్డ్ మెడిటేషన్ డే కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. అనంతరం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నేరుగా ఢిల్లీకి బయలుదేరుతారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో తెలంగాణ, హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.


ReadLatestandHealthNews