అక్కయ్యపాలెం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని అక్కయ్యపాలెంలో గల పోర్టు స్టేడియంలో ‘పెసా’ మహోత్సవం మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్‌ జాయింట్‌ సెక్రటరీ ముక్తా శేఖర్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ, ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ ఈ ఉత్సవ్‌ను ప్రారంభించారు. ముందుగా వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన గిరిజనులు ఏర్పాటుచేసిన 68 స్టాళ్లను లాంఛనంగా ప్రారంభించారు. ప్రదర్శనలో ఉంచిన గిరిజన ఉత్పత్తులను, సంప్రదాయ వంటకాలను పరిశీలించారు. హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన గిరిజన మహిళలు కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, మంగళగిరి, వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, సంప్రదాయ ఆహార ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు. ఈ ఉత్సవం బుధవారంతో ముగుస్తుంది.