హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ (Film Actor Sivaji)దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నోటీసులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలకు గానూ హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఈ మేరకు ఇవాళ(సోమవారం) ఓ ప్రకటన విడుదల చేశారు శివాజీ.
తాను మాట్లాడిన మాటలు మహిళలు అందరి గురించి కాదని స్పష్టం చేశారు. మూవీ హీరోయిన్స్ బయటకు వెళ్లినప్పుడు నిండుగా బట్టలు ధరించి వెళ్లాలని సూచించానని అన్నారు. అలా వెళ్తే తమకు ఇబ్బంది ఉండదేమోననే కోణంలోనే మాట్లాడాను తప్ప వేరే ఎవరినీ అవమానపరచాలనీ తాను మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. తాను మాట్లాడిన సందర్భంలో రెండు అన్ పార్లమెంటరీ వర్డ్స్ వచ్చాయని... వాటికి సీన్సియర్గా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు శివాజీ.
సమాజంలో స్త్రీలను తక్కువ స్థాయిలో చూస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వవద్దనే తాను ఇలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. తన మాటలతో మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప.. తనకు ఎవరినీ అవమానపరచాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమలోని ఆడవారి మనోభావాలు దెబ్బతిన్నందుకు గానూ.. మహిళలు ఎవరైనా ఈ విషయాన్ని తప్పుగా అనుకుంటే అందరికీ తన హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నానని నటుడు శివాజీ పేర్కొన్నారు.
మంచు విష్ణు ఏమన్నారంటే..

శివాజీ మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు (ManchuVishnu)స్పందించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. డండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన నుంచి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు క్షమాపణ అందిందని పేర్కొన్నారు. శివాజీ మాట్లాడిన భాషపై ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ విషయాన్ని పరిష్కరించినట్లుగా మా అసోసియేషన్ భావిస్తోందని అన్నారు. ఈ అంశం ఇక్కడితో ముగుస్తుందని ఆశిస్తున్నామని మంచు విష్ణు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For MoreTG NewsAndTelugu News