అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):ధాన్యం కొనుగోళ్లతో సహా వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu)అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ(మంగళవారం) ఏపీ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు.
వివిధ జిల్లాల్లో నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచనలు ఇచ్చారు. ఏపీ వ్యాప్తంగా ఒకే తరహా బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు విధానం మేరకు తక్షణమే చర్యలు ఉండాలని నిర్దేశించారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోళ్లు చేసే మిల్లర్లు ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా చూడాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ..
మరోవైపు.. ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. యువతలో నైపుణ్యం పెంచేలా క్వాంటం టెక్నాలజీ కోర్సులు ఉండాలని దిశానిర్దేశం చేశారు. పాఠశాలల్లో దశలవారీగా కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశానికి ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతి, ఐబీఎం సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే ఏడాది నుంచి రెండేళ్ల పాటు నాలుగు విడతల్లో విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. 7,8,9 తరగతులు చదివే విద్యార్థులకు క్వాంటంపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 2026 జనవరి చివరిలో స్టూడెంట్స్ పార్టనర్ షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆ సమ్మిట్లో విద్యార్థులు తమ ఇన్నోవేషన్స్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేద్దామని సీఎం చంద్రబాబు సూచించారు.
ఇవి కూడా చదవండి...
Read LatestAP NewsAndTelugu News