మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యపై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. ఇన్నయ్య రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. రిమాండ్ రిపోర్టులో ఏముందంటే.. ‘అక్టోబర్ 18వ దేశ భద్రతకు హాని కలిగించేలా గాదే ఇన్నయ్య వ్యాఖ్యలు చేశాడు. వికల్ప్ అంత్యక్రియల సందర్భంగా  ఇన్నయ్య తీవ్ర వాఖ్యలు చేశాడు. వికల్ప్ అంత్యక్రియలకు 200 మంది హాజరయ్యారు. అంత్యక్రియల వద్ద అమరుల బంధుమిత్రుల సంఘం పేరుతో బహిరంగ సభ ఏర్పాటైంది.


ఈ సభలో విద్వేషాలు రెచ్చగొట్టి మావోయిస్టు ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గాదె ఇన్నయ్య పిలుపునిచ్చాడు. దేశంలో కుట్రలు చేసి భద్రతకు హాని కలిగించాలని తీవ్రవాఖ్యలు చేశాడు. దేశంలో అనేక చోట్ల విధ్వంసాలకు పాల్పడాలని కుట్రపన్నాడు. నవంబర్ 24న కేసు నమోదైంది. సీపీఐ మావోయిస్టు పార్టీకి మద్దతు తెలపడంతో పాటు వారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తానని ప్రసంగించాడు. ప్రజలను విద్వేషాల వైపు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. గాదె ఇన్నయ్యకు అనేకమంది మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాయి. మావోయిస్టు రిక్రూట్మెంట్‌‌తో పాటు పార్టీకి ఫండింగ్ కూడా చేశాడు. ఇలాంటి వ్యక్తులు బయట ఉంటే ప్రమాదకరం’ అని ఉంది.


కేంద్ర హోంశాఖ మంత్రికి వ్యతిరేకంగా..

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత గాదె ఇన్నయ్య ఛత్తీష్‌గడ్ వెళ్లారు. హిడ్మా తల్లిని కలిశారు. అక్కడున్న నేషనల్, స్టేట్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్లతో హిడ్మా మరణంపై ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ఈ సమయంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అమిత్ షా తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు పంపింది. తాజాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఇన్నయ్యపై కేసు నమోదు చేసింది.


ఇవి కూడా చదవండి