ఇంటర్నెట్ డెస్క్:ఐపీఎల్ క్రికెటర్, కర్ణాటకకు చెందిన స్టార్ ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఈ 37 ఏళ్ల స్టార్ ఆల్‌రౌండర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2012లో రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచులో కర్ణాటక తరఫున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే సురేష్ రైనా, భువనేశ్వర్ కుమార్‌ల ముఖ్యమైన వికెట్లను పడగొట్టాడు.


2016-2017 రంజీ ట్రోఫీ సీజన్ అతని(Krishnappa Gowtham) కెరీర్ ఒక ప్రధాన మలుపుగా నిలిచింది. కేవలం ఎనిమిది మ్యాచ్‌ల్లోనే 27 వికెట్లు పడగొట్టాడు. తరువాతి సీజన్‌లో, అతను మైసూర్‌లో అస్సాంపై తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించాడు, బ్యాట్ మరియు బంతి రెండింటితోనూ మ్యాచ్‌లను ప్రభావితం చేసే తన సామర్థ్యాన్ని మరింతగా పెంచుకున్నాడు. మొత్తంగా 36 మ్యాచులు ఆడిన కృష్ణప్ప.. 247 పరుగులు చేశాడు. తన దేశీయ కెరీర్‌లో కృష్ణప్ప.. 59 ఫస్ట్-క్లాస్, 68 లిస్ట్ ఏ మ్యాచుల్లో 320 వికెట్లు పడగొట్టాడు.


ఐపీఎల్‌లో అదురహో!

ఐపీఎల్‌లో కృష్ణప్ప.. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2021లో సీఎస్కే అతడిని రూ.9.25కోట్లకు కొనుగోలు చేసింది. కృష్ణప్ప కెరీర్‌లోనే అది అత్యధిక ధర. తొమ్మిది ఐపీఎల్ సీజన్లలో, అతను రూ.35 కోట్లకు పైగా సంపాదించాడు.. అనేక చిరస్మరణీయ ప్రదర్శనలను అందించాడు. 2019 కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో బళ్లారి టస్కర్స్ తరఫున ఆడుతున్న గౌతమ్ 56 బంతుల్లో 134 పరుగులు చేశాడు. ఇందులో 13 సిక్సర్లు ఉన్నాయి. ఇది అతడి కెరీర్‌కే హైలెట్ ఇన్నింగ్స్. అతను కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత అతను బంతితో అద్భుతంగా రాణించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులకు ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.