అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)జనసేన నేతలతో మంగళగిరిలోని ఆ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలను ఉద్దేశించి మాట్లాడారు పవన్ కల్యాణ్.
త్వరలోనే మరికొన్ని కమిటీల్లో కూడా కీలక పదవులు కేటాయించబోతున్నామని స్పష్టం చేశారు. పదవులు చిన్నవా.. పెద్దవా అని కాదని.. వాటి బాధ్యతలను అందరూ గుర్తించాలని దిశానిర్దేశం చేశారు. ఇవాళ(సోమవారం) మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. జనసేన ఆధ్వర్యంలో పదవి - బాధ్యత పేరుతో సమావేశం నిర్వహించారు.
బాలినేని నిదర్శనం..
‘జనసేన నుంచి 3400 మంది నామినేటేడ్ పదవులు పొందారు. ప్రస్తుతం మన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. మన సిద్దాంతాలు, విధానాలు నచ్చి మరికొంతమంది ఎమ్మెల్యేలు జనసేనలో చేరనున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేనకు ఒక ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు ఉన్నారు. నాగబాబు చేసిన త్యాగాలను గుర్తించి అన్నయ్యకు, పార్టీ కోసం నిలిచిన హరిప్రసాద్కు ఎమ్మెల్సీలు ఇచ్చాం.
పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లుగా పదవులు ఇచ్చాం. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వంటి నేతలు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు. బాలినేని లాంటి నేతలు ఇప్పుడు రెండు వైపులా మాటలు పడే పరిస్థితి. కెరియర్ ఓరియంటెండ్ పొటిలికల్ లీడర్ ఎలా ఉంటారో చెప్పేందుకు బాలినేని నిదర్శనం. జగన్ ప్రభుత్వం దాష్టికాలకు వ్యతిరేకంగా బయటకు వచ్చిన సమయంలో.. సాయిప్రసాద్ను మహిళా సీఐ కొట్టినా వెనుకడుగు వేయలేదు. అటువంటి సాయి ప్రసాద్ను శ్రీకాళహస్తీ ఆలయ చైర్మన్గా నియమిచ్చాం’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
జగన్ ప్రభుత్వంలో ఇబ్బందులు...
‘గంటా స్వరూప, ప్రియా సౌజన్య కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమించాం. పంచకర్ల సందీప్కు కార్పొరేషన్ చైర్మన్గా చేస్తున్నాం. మన నేత రూపపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జగన్ ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టారు.. ఆమెను కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నుకున్నాం. ఇలా పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసిన వారిని గుర్తించి.. అనేక పదవులు ఇచ్చి బాధ్యతలు అప్పగించాం. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చిన విషయం ఆయనకు చివరి వరకూ తెలియదు. అంటే ఎవరి సిఫార్సులు లేకుండా.. కేవలం పని ఆధారంగానే పదవులు కేటాయించాం.
ఓటమి పాలయినా పార్టీ కోసం పని చేసిన మహిళలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించాం. చిల్లపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈరోజు ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు ఏపీయంయస్ఐడీ చైర్మన్గా చిల్లపల్లి శ్రీనివాస్ ఉన్నారు. పోలీసు హౌంసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అనేక పేర్లు వచ్చినప్పటికీ.. కేకే సరైన వారు అని నియమించాం. చాలా సంవత్సరాలుగా ఆయన పోలీసులతో పోరాడారు. హస్తకళల చైర్మన్గా హరిప్రసాద్, జానపదకళల చైర్మన్గా మనమే నియమించాం. మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా విజయ కుమార్ను నియమించాం. ఇలా చాలా కార్పొరేషన్లకు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఎంపిక చేయడం వెనుక మా ఉద్దేశం ప్రజలకు బాధ్యతతో సేవ చేస్తారనే నియమిస్తున్నాం. షేక్ రియాజ్ మొదటి నుంచి పార్టీ కోసం పోరాడారు’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Read LatestAP NewsAndTelugu News