మహబూబాబాద్, డిసెంబర్ 22:ఉన్నతాధికారుల తీరు కారణంగా గూడూరు మండలం దామరవంచలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. డిసెంబర్ 11వ తేదీన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, ఎంపీ బలరాం నాయక్ వర్గానికి చెందిన నునావత్ స్వాతి కేవలం 3 ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల రిట్నరింగ్ అధికారి ధృవపత్రం అందజేశారు. సోమవారం అంటే.. ఈ రోజు పంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన, స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ వర్గానికి చెందిన సనప సుజాతను ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు ఆహ్వానించారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో సుజాతే గెలుపొందిందంటూ మరో ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అందజేశారు.
దాంతో ఈ పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించినట్లు ఉన్నతాధికారుల ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో సర్పంచ్ ఎవరనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయం ఇరు వర్గాల వారికి తెలిసింది. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఉన్నతాధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
For MoreTG NewsAndTelugu News