హైదరాబాద్, డిసెంబర్ 21:హైడ్రా కమిషనర్ రంగానాథ్ గన్మెన్ ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణ చైతన్య ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆదివారం కృష్ణచైతన్య ఆరోగ్యంపై ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అతడికి న్యూరోసర్జన్లు డాక్టర్ ఎం ఏ జలీల్, డాక్టర్ సాయి శివ నేతృత్వంలో శస్త్ర చికిత్స నిర్వహించినట్లు తెలిపారు.
మెదడుకు సిటీ స్కాన్ చేశామని.. పుర్రెకు, మెదడుకు తీవ్రమైన పగుళ్లు ఉన్నట్లు నిర్ధారించామని వైద్యులు పేర్కొన్నారు. అతడు ప్రస్తుతం ఇంటెన్సివ్ న్యూరో క్రిటికల్ కేర్లో చికిత్స పొందుతున్నాడని వివరించారు. రానున్న 48 గంటలు అతడిని అబ్జర్వేషన్లోనే ఉంచుతామన్నారు. కృష్ణ చైతన్య ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణచైతన్య.. హైదరాబాద్ నగర శివారు హయత్నగర్లోని తన నివాసంలో ఆదివారం అంటే.. ఈ రోజు ఉదయం తుపాకీతో కాల్పుచుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. దాంతో అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అతడికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. అతడి పరిస్థితి విషమంగా వైద్యులు వెల్లడించారు.
ఆర్థిక సమస్యల కారణంగానే కృష్ణచైతన్య ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. అయితే తమకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని కృష్ణచైతన్య కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. కృష్ణచైతన్య ఆత్మహత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యాప్లు, గేమింగ్ యాప్ల కారణంగా కృష్ణచైతన్య తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అతడి జీతంలో అధిక భాగం అప్పులకే వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఈ కారణంగా.. ఇటీవల ఇంటి నుంచి అతడు వెళ్లిపోయాడనే ప్రచారం జరుగుతోంది. దాంతో హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
For MoreTG NewsAndTelugu News