ఇంటర్నెట్ డెస్క్: దాదాపు ఏడేళ్ల తరువాత ఇండియాకు వచ్చిన ఓ ఎన్నారై దేశంలో వచ్చిన మార్పులు చూసి షాకయిపోయారు. దేశం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని కామెంట్ చేశారు. రెడిట్ వేదికగా ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

తాను చాలా కాలం యూరప్‌లో పనిచేశానని చెప్పారు. తనను చూసేందుకు కుటుంబమే యూరప్‌కు రావడంతో తాను భారత్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చినట్టు చెప్పారు.

‘ఇక్కడకు వచ్చి చూస్తే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. జనాలు నగదు వాడటం దాదాపుగా మానేశారు. అందరూ డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. జనాల వస్త్రధారణలో కూడా బాగా మార్పు వచ్చింది. పాశ్చాత్య దేశాల్లోని ఒరవడి కనిపిస్తోంది. ముఖ్యంగా యువతులు మోడర్న్ డ్రెస్సులు అధికంగా ధరిస్తున్నారు. వీధుల్లో కార్ల సంఖ్య కూడా పెరిగింది. ఎక్కడ చూసినా కార్లే కనిపిస్తున్నాయి. టైర్-2 టౌన్‌లల్లోని వారు ప్రస్తుతం స్పోర్ట్స్ బైకులు నడుపుతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరా హై ఎండ్ స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది’ అని చెప్పారు.


NRI.jpg

ఇక నెటిజన్లలో అనేక మంది ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు. కొందరు మాత్రం సెటైర్లు పేల్చారు. ‘మరి ఇక్కడి కాలుష్యం, గడబిడ, నగరాల నిర్మాణాల్లో ప్లానింగ్ లేకపోవడం వంటివి మీరు చూడలేదా. ప్రపంచంతో పాటు భారత్‌ కూడా ఎదిగింది కానీ ఇక్కడి వ్యవస్థలు మాత్రం పాతవే. అందుకే నగరాలు ఇలా కనిపిస్తున్నాయి’ అని ఓ వ్యక్తి అన్నారు. ప్రజారోగ్య వ్యవస్థ అస్సలు మెరుగుపడలేదని మరో వ్యక్తి కామెంట్ చేశారు.