- రాణి గారి చీర!

రాజు, రాణి ఎక్కడికి వెళ్లినా పెద్ద వార్తే అవుతుంది. అలాగే ఈ రాణీగారు కట్టుకున్న చీర హాట్‌ టాపిక్‌గా మారింది. చీర అనగానే భారతీయ రాజవంశానికి చెందిన రాణి అనుకునేరు. ఈవిడ నెదర్లాండ్స్‌కు చెందిన రాణి మాక్సిమా. ఇటీవలే రాజు విలియమ్‌ అలెగ్జాండర్‌తో కలిసి మాక్సిమా సురినామ్‌ సందర్శించారు. యూరోపియన్‌ రాణీవాసపు స్త్రీలు చీర కట్టుకోవడం చాలా అరుదైన విషయం. ఈ రాణి చీర వెనక పెద్ద కథే ఉంది.


నెదర్లాండ్స్‌ నుంచి దక్షిణ అమెరికా దేశమైన సురినామ్‌ 1975లో స్వాతంత్య్రం పొందింది. ఆ దేశ జనాభాలో హిందువులు అధిక సంఖ్యలో ఉంటారు. వీరంతా 19వ శతాబ్దంలో భారతదేశం నుంచి అక్కడికి వలస వెళ్లినవారే. అందుకే అక్కడి భారత సంతతితో స్నేహసూచకాన్ని తెలియపరుస్తూ రాణి గారు చీరను ధరించారు. ఈ ఆకుపచ్చ రంగు పట్టు చీరకు సంబంధించి మరో విశేషమూ ఉంది. ఇదే చీరను ఆమె 2019లో భారతదేశం సందర్శించినప్పుడూ కట్టుకున్నారు. దానినే భద్రపరచి, సురినామ్‌ పర్యటనలో మరోసారి అదే చీరలో దర్శనం ఇచ్చారు. అంటే రాణులైనా సరే అధికారిక వేడుకల్లో దుస్తులను రిపీట్‌ చేస్తారని అర్థం అవుతోంది. ఇదే విషయం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Read LatestTelangana NewsandNational News