అమరావతి:తెలుగుదేశం పార్టీ(TDP)ని, అనుబంధ సంఘాలను మరింత బలోపేతం చేయాలని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి పెండింగ్‌లో ఉన్న పార్టీ కమిటీలపై దృష్టి పెట్టాలని సూచించారు. టీడీపీ రీజినల్ కోఆర్డినేటర్ల(TDP Regional Coordinators)తో మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు వారితో భేటీ అయ్యి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో నిర్మించ తలపెట్టిన పార్టీ కార్యాలయాల నమూనాలను ప్రదర్శించి కోఆర్డినేటర్ల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు లోకేశ్.


ఈ సందర్భంగా పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో జరిగే గ్రీవెన్సు్ల్లో సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయో తెలుసుకోవాలని సూచించారు. కోఆర్డినేటర్లు దీనికి సంబంధించిన నివేదికలు తయారు చేయాలని హుకుం జారీ చేశారు. డీడీఆర్సీ సమావేశం జరిగే రోజే ఇన్‌ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరుపుకోవాలని చెప్పుకొచ్చారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయ నిర్మాణం గురించి ఇన్‌ఛార్జ్ మంత్రితో కలిపి కోఆర్డినేటర్లు చర్చించాలని మార్గనిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న పార్టీ కమిటీలపై దృష్టి పెట్టాలని.. మిగిలిన నామినేటెడ్ పదవులకు అర్హులైన అభ్యర్థుల జాబితాను రెడీ చేయాలని స్పష్టం చేశారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో అకారణంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టారని.. ఆ కేసులను చట్టపరంగా త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. పార్టీ శ్రేణులకు అండగా ఉండాలని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.