ఇంటర్నెట్ డెస్క్:టీ20 వరల్డ్ కప్ 2026 భారత జట్టు ఎంపిక క్రికెట్ అభిమానులతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శుభ్మన్ గిల్(Shubman Gill) ను భారత జట్టు మెనెజ్మంట్ ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో ఓపెనర్ గా సంజూ శాంసన్ ను ఎంపిక చేసింది. అలానే సౌతాఫ్రికాతో జరిగిన టీ20లో వికెట్ కీపర్ గా వ్యవహరించిన జితేశ్ శర్మను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో దేశవాళీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఇషాన్ కిషన్ కు జట్టులో స్థానం కల్పించారు. ఇక గిల్ ను ఎంపిక చేయకపోవడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ సమావేశం అనంతరం 15 మంది సభ్యులతో కూడిన భారత టీ20 ప్రపంచకప్ జట్టు వివరాలను భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. జట్టు కూర్పులో భాగంగానే శుభ్మన్ గిల్(Shubman Gill)ను పక్కనపెట్టామని అజిత్ అగార్కర్ తెలిపాడు. జట్టులో 15 మంది ఆటగాళ్లనే ఎంపిక చేయగలమని, ఇలాంటి సందర్భంలో ఎవరో ఒకరు జట్టుకు దూరం కావాల్సి ఉంటుందన్నాడు.శుభ్మన్ గిల్ ఎంతటి క్వాలిటీ ప్లేయరో అందరికీ తెలుసని, ప్రస్తుతం అతను పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడని అన్నాడు. గత టీ20 ప్రపంచకప్లో కూడా విభిన్న కాంబినేషన్ల కారణంగా అతనికి టీ20 జట్టులో చోటు దక్కలేదని, ప్లేయర్ కంటే టీమ్ కాంబినేషన్ చాలా ముఖ్యమని అగార్కర్ స్పష్టం చేశాడు.
ఈ సారి కూడా టీమ్ కాంబినేషన్లో భాగంగా శుభ్మన్ గిల్ను పక్కనపెట్టాల్సి వచ్చిందని, 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయగలమని వెల్లడించాడు. ఇక వైస్ కెప్టెన్ విషయంపై కూడా అజిత్ అగార్కర్ పలు విషయాలను తెలిపాడు. శుభ్మన్ గిల్ లేనప్పుడు అక్షర్ పటేల్ టీ20ల్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించాడని, ఇప్పుడు కూడా గిల్ అందుబాటులో లేడు కాబట్టి ఆ బాధ్యతలను తిరిగి అక్షర్కే అప్పగించామని తెలిపాడు. టాపార్డర్లో ఆడే వికెట్ కీపర్ కావాలని భావించి.. ఇషాన్ కిషన్ను తీసుకున్నామన్నాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్లో ఉన్నాడని, అంతేకాకుండా అతను ఓపెనర్గా కూడా రాణించగలడని అగార్కర్(Ajit Agarkar statement) వెల్లడించాడు.