ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 20:ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్-వారణాసి హైవేపై ఉన్న ప్రముఖ సామ్రాట్ ధాబా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అక్కడ భోజనం చేస్తున్న కస్టమర్కు సర్వ్ చేసిన పెరుగు అన్నంలో చనిపోయిన ఎలుక ఉండటంతో అతను ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.
ఈ ఘటన డిసెంబర్ 18న జరిగినట్లు తెలుస్తోంది. కస్టమర్ ఈ దారుణ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. సదరు వీడియోలో ధాబా యజమాని.. వంట సిబ్బందిని దీనికి సంబంధించి ప్రశ్నించడం కనిపిస్తోంది.
విషయం తెలిసిన వెంటనే ఆహార భద్రతా శాఖ అధికారులు ధాబాకు చేరుకుని తనిఖీ చేశారు. వంటగదిలో అపరిశుభ్రత, తప్పుడు నిల్వ పద్ధతులు గుర్తించారు. అయితే, ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. హైవే ధాబాల్లో ఆహార భద్రతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నెటిజన్లు.
ఆహార నమూనాలు సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపారు. వెంటనే ధాబాను సీల్ చేసి, లోపాలు సరిదిద్దే వరకు ఆహార తయారీ, అమ్మకాలను నిషేధించారు. ఫుడ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ రమేష్ చంద్ర పాండే దీనిపై మాట్లాడుతూ, 'ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని హెచ్చరించారు. ధాబా యజమాని కూడా వడ్డించిన పెరుగు అన్నంలో ఎలుక ఉన్నట్టు అంగీకరించినట్లు సమాచారం.