హైదరాబాద్:పబ్లిక్ సర్వీస్ కమిషన్లు( Public Service Commissions) దేశ పరిపాలనా వ్యవస్థకు వెన్నెముకలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka) అన్నారు. న్యాయమైన, పారదర్శక నియామకాల ద్వారానే ప్రజాసేవలో ప్రతిభకు స్థానం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన 26వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పరీక్షలకు వార్షిక జాబ్ క్యాలెండర్ తప్పనిసరని అన్నారు. ఉద్యోగ నియామకాల జాప్యం యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని.. ముందస్తు ప్రణాళికతోనే వారిలో విశ్వాసం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ పీఎస్సీ ( PSC) విజయవంతంగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తోందని చెప్తూ కమిషన్ ఛైర్మన్, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందించారు. పారదర్శకతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ప్రాణమని.. ప్రశ్నాపత్రాల తయారీ నుంచి తుది ఎంపిక వరకూ ప్రతి దశ స్పష్టంగా ఉండాలన్నారు.


ప్రశ్నాపత్రాల లీకేజ్‌లు ప్రజాసేవ విలువలకు విరుద్ధమని.. వాటిని కట్టడి చేసేందుకు ఆధునిక భద్రతా వ్యవస్థలు, నైతిక శిక్షణ అవసరమని సూచించారు. రిజర్వేషన్లు సంఖ్యలకే కాదని, వాస్తవిక ఫలితాలు ఇవ్వాలంటూ డిప్యూటీ సీఎం భట్టి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం హాజరయ్యారు.